Vaalmiki Ramayanam – 52 సుగ్రీవుడు తార, రుమలతో హాయిగా, సంతోషముగా కాలం గడపసాగాడు.
బాలేంద్రగోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన |
గాత్రానువృత్తేన శుకప్రభేణ నారీవ లాక్షోక్షిత కంబళేన ||
వర్షాకాలాన్ని చూసి రాముడు ” లక్ష్మణా ! ఈ వర్షాకాలములో వర్షములు విశేషముగా పడడము వలన భూమిమీద గడ్డి బాగా పెరిగి భూమి అంతా ఆకుపచ్చగా ఉన్నది.
భూమిమీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఆ దృశ్యం భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకున్నదా! అన్నట్టుగా ఉన్నది.
నదులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి. మేఘాలు కురుస్తున్నాయి. ఏనుగులు పెద్ద శబ్దములు చేస్తున్నాయి. వనములయొక్క మధ్య భాగములు ప్రకాశిస్తున్నాయి.
భార్యలు పక్కన లేనివారు ధ్యానము చేస్తున్నారు. వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. వానరములన్నీ చాలా సంతోషముగా ఉన్నాయి. Vaalmiki Ramayanam – 52
ఆకాశములో వెళుతున్న మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథములా ఉన్నాయి. మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకములా ఉన్నాయి. మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతున్నది.
ఇవన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు రావణాసురుని మీద యుద్ధం చేద్దామాని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకము వస్తున్నది.
మార్గానుగః శైలవనానుసారీ సంప్రస్థితో మేఘరవం నిశమ్య |
యుద్ధాభికామః ప్రతినాదశంకీ మత్తో గజేంద్రః ప్రతిసన్నివృత్తః ||
ఒక పెద్ద మదగజము వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉన్నది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ‘ ఆహా! ఇంకొక మదగజం కూడ ఎక్కడో అరుస్తున్నది దాని మదం అణిచేస్తాను ‘ అనుకొని తన తొండము పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది.
కొంతదూరం వెళ్ళాక మళ్ళీ ఆ మేఘం శబ్దం చేసింది. ‘ ఓహో మేఘము ఉరుముతున్నది. మరొక మదగజము కాదన్నమాట ‘ అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి తాను ముందు పడుకున్న చోటనే పడుకున్నది.
రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో కాని ఎప్పుడైతే మేఘంనుంచి పడిన వర్షధారలు ఈ కప్పలని కొట్టగానే ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకేరకమైన శబ్దం చేశాయి. ఈ వర్షములు పడే కాలములోనే సామవేదాన్ని నేర్చుకునేవారికి పాఠం ప్రారంభిస్తారు. Vaalmiki Ramayanam – 52
నిద్రా శనైః కేశవమభ్యుపైతి ద్రుతం నదీ సాగరమభ్యుపైతి |
హృష్టా బలాకా ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి ||
నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది. నది వేగముగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది. ఆకాశములో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి.
పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావము చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతుంది. ఈ వర్షాకాలము ఎంతో గొప్పది. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను.
నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉన్నది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీకమాసం వస్తుంది అప్పుడు వర్షం కురవదు. సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారము చేస్తాడు ” అని అన్నాడు. Vaalmiki Ramayanam – 52
వర్షాకాలం పూర్తయిపోయింది. కార్తీకమాసం మొదలయ్యింది. హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ” సుగ్రీవా! నువ్వు రాముడి అనుగ్రహము చేత రాజ్యాన్ని పొందావు.
నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారము చెయ్యాలి. నాలుగు విషయాలలో రాజు ఎప్పుడూ కూడ అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారము ఎప్పుడూ నిండుగా ఉండాలి. తగినంత సైన్యం ఉండాలి.
మిత్రులయందు పరాకుగా ఉండకూడదు. ప్రభుత్వాన్ని నడిపించడములో శక్తియుతంగా ఉండాలి. ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది.
నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి కాని నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకము చెయ్యాలి. రాముడు జ్ఞాపకము చేస్తే వేరొకలా ఉంటుంది.
అలా జ్ఞాపకము చెయ్యకపోవడము రాముని యొక్క ఔదార్యం. పోనిలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామ దర్శనము చెయ్యడము మంచిది.
నువ్వు వానరములను దశదిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెపితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యము ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. Vaalmiki Ramayanam – 52
రాముడు నీకు రెండు ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో ‘ నేను నీకు ఉపకారము చేస్తాను.
నువ్వు సీతని అన్వేషించి పెట్టు ‘ అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యదార్ధమునకు నీ నుంచి ఆశించలేదు. అన్నిదిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములు నీ దగ్గర ఉన్నారు.

వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహముతో ఉన్నారు. నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు.
రాముడే దుఃఖపడి కోదండమును పట్టుకుంటే ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడ ప్రమాదము ” అన్నాడు.
హనుమంతుడి మాటలని అర్ధం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిచి ” నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృధ్వీ మండలములో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా, లాంగూలములు ఉన్నా, భల్లూకములు ఉన్నా, అన్నిటినీ కూడా వెంటనే చేరమని చెప్పు.
ఇవన్నీ కూడా పదిహేను రోజుల లోపల ఇక్కడికి రావాలి. తరవాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుత్తుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు ” అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు, సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు.
కార్తీకమాసం వచ్చినా సుగ్రీవుడినుండి ఒక్కమాట కూడా రాకపోవడము చేత రాముడు లక్ష్మణుడిని పిలిచి ” పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుమాడుకోడానికి సైన్యముతో యుద్ధానికి వెళ్ళిపోయారు.
ఆకాశము అంతా నిర్మలముగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధము అయ్యాయి. నేల మీద ఉండే బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు. Vaalmiki Ramayanam – 52
శరత్ ఋతువు వచ్చేసింది. కాని సుగ్రీవుడికి మాత్రము ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసినవాడిగా కనపడడము లేదు.
లక్ష్మణా! సుగ్రీవుడు ఎందుకు ఉపకారము చెయ్యడము లేదో ఈ గుహ దగ్గరికి ఎందుకు రావడములేదో నాతో ఎందుకు మాట్లాడడము లేదో తెలుసా?
ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే |
కృపాం న కురుతే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ ||
నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అపారమైన దుఃఖముతో ఉన్నాను. రాజ్యము పోయింది. అటువంటి దీనుడిని కదా, ఇవ్వాళ నా దగ్గర ఏముంది? గుహలో పడుకొని ఉన్నాను కదా! అందుకని సుగ్రీవుడికి నా మీద కృపలేదు.
నన్ను రక్షిస్తానని అన్న సంగతి మరిచిపోయాడు. నేను ఇప్పుడు అనాథని రావణుడేమో నన్ను అవమానించాడు. దీనుడిని ఇంటికి చాలా దూరముగా ఉన్నాను.
నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను. అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చెయ్యడము లేదు.
ఈ కారణాల వల్లే సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమిచెయ్యాలో తెలుసు. చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు తన భార్యలతో కామసుఖాన్ని అనుభవిస్తున్నాడు.
అర్థినాముపపన్నానాం పూర్వం చాప్యుపకారిణామ్ |
ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః ||
ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారమును చెయ్యడో వాడు పురుషాధముడు అని శాస్త్రం చెబుతుంది. ఒకమాట నోటివెంట వస్తే ఆ మాటకి కట్టుబడిపోయిన వాడిని పురుషోత్తముడు అంటారు.
తమ పనులు పూర్తి చేసుకొని తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్నవాడి యొక్క శరీరము పడిపోయిన తరువాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. Vaalmiki Ramayanam – 52
ఇవ్వాళ సుగ్రీవుడు అటువంటి కృతఘ్నతా భావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను కోదండాన్ని పట్టుకొని వేసే బాణముల యొక్క మెరుపులని చూడాలని నా వింటినారి యొక్క ధ్వనిని వినాలని అనుకుంటున్నట్టుగా ఉన్నాడు.
రాముడికి కోపం వచ్చి యుద్ధ భూమిలో నిలబడిననాడు రాముడి స్వరూపము ఎలా ఉంటుందో మరిచిపోయినట్టున్నాడు.
లక్ష్మణా! నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి ‘ సుగ్రీవా ! మా అన్నగారు కోపము వచ్చి కోదండము పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన యొక్క రూపము చూడాలని అనుకుంటున్నావా? ‘ అని అడుగు.
నచసంకుచితః పంథా యేన వాలీ హతో గతః |
సమయే తిష్ఠ సుగ్రీవ మావాలి పథమన్వగాః ||
అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు ‘ వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయ్యలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందమునకు కట్టుబడి ఉండమని చెప్పు.
లేకపోతే నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు ‘ అని చెప్పు. ఆనాడు ధర్మము తప్పిన వాలిని ఒక్కడినే ఒకే బాణముతో చంపాను, ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణముతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు ” అని అన్నాడు.
లక్ష్మణుడు ” ఎందుకన్నయ్యా అన్ని మాటలు? వాడు రాజ్యం పరిపాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారము చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను.
ఇంక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీదాకా ఎందుకు నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకము చేస్తాను. Vaalmiki Ramayanam – 52
అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదము తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వస్తున్నది నేను ఇప్పుడే బయలుదేరి వెళతాను ” అన్నాడు.
ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపెస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో ” లక్ష్మణా! మనం ఇంతకముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకము పెట్టుకో.
ఆ స్నేహాన్ని జ్ఞాపకము పెట్టుకొని సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్ళించు. అంతేకాని చంపేస్తాను అని అమంగళకరమైన మాటలు మాట్లాడకు” అని చెప్పాడు.
రాముడు అన్ని మాటలు చెప్పినా కాని లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవ్వాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కిందా నగరము వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు.
లక్ష్మణుడు వెళుతున్న దారిలో ఒక చెట్టు యొక్క కొమ్మ దారికి అడ్డంగా ఉంది, ‘ నేను వెళుతున్న దారికి అడ్డం వస్తావా ‘ అని ఆ చెట్టుని పెకలించి అవతలపడేసాడు.
ఆయన దారిలో అడ్డువచ్చిన వృక్షాలని, రాళ్ళని పెకలిస్తూ, ముక్కలు చేస్తూ ముందుకి వెళ్ళాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణుడిని చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు.
లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహానాదం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో, రుమతో, వానరకాంతలతో విశేషమైన మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు.
లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో ” నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. ‘ రాముడు శోకంతో ఉన్నాడు.
రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు ‘.
ఈ మాటలని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు ” అన్నాడు. అంగదుడితో పాటు ప్లక్షుడు, ప్రభావుడు అనే ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళారు.
అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రుమకి పాదాభివందనము చేసి లక్ష్మణుడు చెప్పిన మాటలని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడము వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడి మనస్సులోకి వెళ్ళలేదు. Vaalmiki Ramayanam – 52
లక్ష్మణుడిని చూసి భయ భ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కి పడి అక్కడే ఉన్న మంత్రులని పిలిచి ” ఆ వానరాలు ఎందుకు అలా అరుస్తున్నారు? ” అని అడిగాడు.
అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటలని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ” నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చెయ్యలేదు.
బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టడానికి నేనంటే గిట్టనివాళ్ళు రామలక్ష్మణులకి చాడీలు చెప్పి ఉంటారు. నాగురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణులు నమ్మకూడదు వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? స్నేహం చెయ్యడం తేలిక.
స్నేహాన్ని నిలుపుకోవడము చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరువను, రాముడికి సహాయము చెయ్యకపోవడము నా తప్పే ” అన్నాడు.
సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాఽత్ర సంశయః |
భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మి వర్ధనమ్ ||
హనుమంతుడు అన్నాడు ” సుగ్రీవా! నీకు ఇంకా బోధపడలేదు. నీయందు రాముడికి ఉన్నది ప్రతీకారేచ్ఛ కోపం కాదు. ఆయనకి నీయందున్నది ప్రేమతో కూడిన కోపం.
నువ్వు నీ భార్యలతో ఉన్నావు. రాజ్యాన్ని పొందావు వేళ దాటిపోయినా సుఖాలు అనుభవిస్తున్నావు. రాముడికి భార్య లేదు రాజ్యం లేదు. నీకు ఉపకారం చేశాడు నీకు సమయం ఇచ్చాడు.
నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎదురు చూశాడు, నీ నుండి సహకారము లభించకపోవడము వలన బాధపడ్డాడు. ఆ బాధలోనుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది.
నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు వినవలసింది అవతలివాడి కష్టం ఎంత ఉంటే ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి.
నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి ‘ రాముడు నన్ను ఇంతమాట అంటాడ ‘ ని అనవద్దు. లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోవద్దు ” అన్నాడు.
బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా, లోపలినుండి స్త్రీల ఆభరణముల, కంకణముల, వడ్డాణముల శబ్దములు వినపడ్డాయి. లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు, కాని లోపలినుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క ఠంకార ధ్వని చేశాడు. Vaalmiki Ramayanam – 52
పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకుని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఓ ఆసనములో కూర్చున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడి ఒంటిమీద ఉన్న ఆభరణాలు అటుఇటు తొలిగిపోయాయి.
ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్టు సుగ్రీవుడు రుమని తన ఒళ్లో పెట్టుకొని ఆసనములో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటుఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు.
సుగ్రీవుడు తారతో ” తార! ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగినదానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటకి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు.
నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటకి వెళ్ళు ( ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉన్నది. ఆమె ఒంటిమీద బట్ట కూడా సరిగ్గా లేదు. ఆభరణాలు సరిగ్గా లేవు ).
నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడము కాని, స్త్రీతో గట్టిగా మాట్లాడడము కాని, స్త్రీ జోలికి వెళ్ళడము కాని ఇక్ష్వాకువంశీయులు చెయ్యరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుడిని ప్రసన్నుడిని చెయ్యి. అప్పుడు నేను మెల్లగా బయటకి వస్తాను ” అన్నాడు.
సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగా అయ్యి తిరుగుడుపడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటుఇటు తూలిపోతున్నది.
ఆమె వేసుకున్న వడ్డాణం కిందకి జారిపోయింది. పైకి కనపడకూడని హారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి. ఒంటి మీద బట్టకూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటకి వచ్చి లక్ష్మణుడికి కనపడింది.
స తాం సమీక్ష్యైవ హరీశ పత్నీం తస్థావుదాసీనతయా మహాత్మా |
అవాఙ్ముఖోఽభూన్మనుజేంద్రపుత్తః స్త్రీసన్నికర్షాద్వినివృత్త కోపః ||
ఎప్పుడైతే తన దగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపముతో వచ్చిందో పదునాలుగు సంవత్సరముల నుండి భార్యకి దూరముగా యవ్వనములో ఉన్న లక్ష్మణుడు కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేనివాడిగా నిలబడ్డాడు.
అప్పటివరకూ కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెని చూడగానే భూమివంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేసాడు. Vaalmiki Ramayanam – 52